ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ను తప్పించడానికి దాదాపు రంగం సిద్ధమైంది. ఈ మేరకు చింతమనేనితో చర్చించడానికి ఆ పార్టీ నాయకులు వెళ్లినట్టు తెలిసింది. మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తన సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు టికెట్ ఇప్పించుకోడానికి రెడీ అయ్యారు.
చింతమనేని ప్రభాకర్ చౌదరిని తప్పించి, దెందులూరు సీటును బీజేపీకి దాదాపు ఖరారు చేసినట్టు జాతీయ అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏలూరు ఎంపీ సీటు ఆశించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరిని దెందులూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించడానికి పురందేశ్వరి చర్చలు జరిపినట్టు తెలిసింది. ఈ మేరకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది.
ఏలూరు టికెట్ తపనా చౌదరికి దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా కూడా బరిలో దిగడానికి సిద్ధమైనట్టు వార్తలొచ్చాయి. అయితే నాలుగేళ్లుగా ఏలూరు పార్లమెంట్ పరిధిలో తపనా చౌదరి చేస్తున్న సేవల్ని గుర్తించి, ఎలాగైనా ఆయనకు సీటు కేటాయించాలనే పట్టుదలతో వుంది.
ఈ క్రమంలో పురందేశ్వరి కూడా తన సామాజిక వర్గం కావడంతో ఆయన కోసం సీరియస్గా ప్రయత్నించినట్టు బీజేపీ నాయకులు తెలిపారు. ఇప్పటికే బీజేపీకి కేటాయించిన సీట్లలో ఎక్కువ భాగం కమ్మ నేతలకే దక్కాయనే విమర్శ వుంది.
తాజాగా తపనా చౌదరికి కూడా ఇస్తే పురందేశ్వరి తన సామాజిక వర్గానికే కొమ్ము కాస్తున్నారన్న విమర్శలకు బలం చేకూర్చినట్టు అవుతుంది.