పింఛన్ల ప్రభావం ఎటు వుంటుంది?

అయిదేళ్లుగా ఒకటో తేదీ రాకుండానే ఇంటి దగ్గరకు వస్తున్న పింఛను ఇప్పుడు రావడం లేదు. ఇది రెండో నెల. ఇదంతా జగన్ కావాలని చేస్తున్నది అంటున్నాయి కుల పిచ్చను నరనరాలా నింపేసుకున్న కొన్ని పత్రికలు. అసలు అలా చేయడానికో, అలా జరగడానికో కారణం ఏమిటి? అన్నది చెప్పడం లేదు.

ఎవరు కోర్టుకు వెళ్లారు. ఎందుకు వెళ్లారు. అన్నది దాచేస్తున్నారు. ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో నానా యాగీ చేస్తున్నారు. కానీ దిని వల్ల ప్రయోజనం ఏ మేరకు.

ప్రతికలు చదివేది, సోషల్ మీడియాలో వుండేది ఎవరు? పింఛన్లు అందుకునేది ఎవరు? పింఛన్లు అందుకునేవారికి విషయం వివరించేది ఎవరు? ఈ పాయింట్లకు సమాధానం తెలిస్తే, పింఛన్ల ప్రభావం ఎవరి మీద నెగిటివ్ గా వుంటుంది? ఎవరి మీద పాజిటివ్ గా వుంటుంది అన్నది అర్థం అయిపోతుంది.

నెలనెలా పింఛన్లు తెచ్చి ఇస్తున్నది ఎవరు? వాలంటీర్లు. ఇప్పుడు పింఛను అందుకుంటున్నవారు ఎందుకు తేవడం లేదు.. ఎందుకు ఇవ్వడం లేదు.. అని ఎవర్ని అడుగుతారు. అదే వాలంటీర్లను కదా. మరి అప్పుడు వారు చెప్పేదే కదా పింఛన్ అందుకుంటున్న వాళ్లకు అర్థం అయ్యేది. చంద్రబాబు రాకుండానే పింఛన్ ఆగిపోతే, వస్తే ఇంకేంటి పరిస్థితి అనే భయం పుట్టదా?

అందువల్ల పింఛన్ వ్యవహారం, చంద్రబాబు హామీల వైపు ఎవరూ మళ్లిపోకుండా అడ్డుకట్టగా మారిపోయేలా వుంది.