నాగబాబు మళ్ళీ మొదలెట్టాడు.. ఈసారి అల్లుడితో!

ఆపేశానన్నాడుగానీ మళ్ళీ మొదలెట్టాడు నాగబాబు, ఈసారి కొంచెం కొత్తగా 'మై ఛానెల్‌ నా ఇష్టం' అంటూ నెటిజన్ల ముందుకొచ్చాడు. డైరెక్టుగా ఈసారి నందమూరి బాలకృష్ణ మీదకు వెళ్ళలేదు నాగబాబు. కానీ, బాలకృష్ణ మేనల్లుడు నారా లోకేష్‌ మీద సెటైర్లు వేశాడు. 'పొలిటికల్‌ సెటైర్స్‌.. ఎవర్నీ వ్యక్తిగతంగా కించపర్చను. కానీ, సెటైరికల్‌గా వుంటాయి నా వీడియోలు..' అన్నది నాగబాబు 'కంక్లూజన్‌'. 

ఏ రాయి అయితేనేం, పళ్ళూడగొట్టుకోవడానికి.! అన్నట్టుంది నాగబాబు వ్యవహారం. ఇక్కడ నాగబాబు ఉద్దేశ్యం క్రిస్టల్‌ క్లియర్‌గా కన్పిస్తోంది. అల్టిమేట్‌ టార్గెట్‌ బాలకృష్ణే అన్నట్లుగా నాగబాబు అడుగులు వేస్తున్నారు. అది సుస్పష్టం. అన్నయ్య చిరంజీవి తరఫున, తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ తరఫున 'మెగా బ్రదర్‌' నాగబాబు బాధ్యతలు తీసుకుని, రాజకీయంగా, సినిమాల పరంగా తమ కుటుంబాన్ని మెచ్చే అభిమానుల్ని అలరించడానికీ, అదే సమయంలో ప్రత్యర్థి 'క్యాంపులో' అసహనపు నిప్పుల కుంపటిని రాజేయడానికీ ప్రయత్నిస్తున్నట్లుంది వ్యవహారం. 

లేకపోతే, ఎప్పుడో చాలా నెలల క్రితం నారా లోకేష్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తనదైన స్టయిల్లో నోరు జారేసి, తెలుగుదేశం పార్టీ తాలూకు అవినీతినీ, ఆ పార్టీలో పేరుకుపోయిన కుల పిచ్చినీ, ఇతర జాడ్యాల్నీ బయటపెట్టేసిన విషయం విదితమే. ఆ 'దరిద్రాల్ని' ప్రతిపక్షం వైఎస్సార్సీపీకి ఆపాదించే ప్రయత్నంలో నారా లోకేష్‌, తమ పార్టీని భ్రష్టుపట్టించేలా నోరు జారారు. ఆ విషయమై చాలా పెద్ద రచ్చ జరిగింది. చివరికి నారా లోకేష్‌కి 'పప్పు' అన్న బిరుదు కూడా వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. 

ఆ పాత వ్యవహారాన్ని నాగబాబు ఇప్పుడు తెరపైకి తెచ్చారన్నమాట. లోకేష్‌తో మొదలెట్టారు సరే, ముందు ముందు దీన్ని ఎలా కొనసాగిస్తారట.? నెక్స్‌ట్‌ ఎపిసోడ్‌లో ఎవరి పేరు రాబోతోంది.? అంటే, ఇంకెవరిది బాలయ్యదేనన్నది మెజార్టీ అభిప్రాయం. నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం విదితమే. 

'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు' పనుల్లో బాలయ్య బిజీగా వుండడం చూసి, నాగబాబు చాలా హడావిడి చేశారు. 'నో కామెంట్‌' అంటూ బాలయ్య అప్పట్లో నాగబాబుని లైట్‌ తీసుకున్న మాట వాస్తవం. మళ్ళీ ఇప్పుడు 'ఎన్టీఆర్‌ మహానాయకుడు' సినిమా పనుల్లో బాలయ్య బిజీగా వున్న సమయం చూసి, మళ్ళీ నాగబాబు కెలుకుతున్నారన్నమాట. మరి, ఈసారి బాలయ్య ఏం చేస్తారు.? వేచి చూడాల్సిందే.  

Show comments