ప్రజలకు మంచి చేసేందుకు చంద్రబాబునాయుడికి మనసు రాదని సహజంగా అందరూ అంటుంటారు. అలాంటి చంద్రబాబునాయుడు సూపర్సిక్స్, ప్రజాగళం అంటూ సంక్షేమ పథకాలతో కూడిన మేనిఫెస్టోను పవన్కల్యాణ్తో కలిసి విడుదల చేశారు. అయితే ఈ మేనిఫెస్టోకు కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ దూరం జరగడం వెనుక బాబుపై అపనమ్మకమే కారణమని జనం అనుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో రైతుకు ఏడాదికి రూ.20 వేలు, సామాజిక పింఛన్దారులకు రూ.4 వేలు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత విద్యార్థులు చదువుకుంటున్నారో, వాళ్లందరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తానని చంద్రబాబు హామీలివ్వడంపై అప్పుడే అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలే చంద్రబాబు ఏదో ఒకటి మెలిక పెట్టనందే ఏ లబ్ధి చేకూర్చరనే అభిప్రాయం ఉంది.
దీంతో ఆయన చెబుతున్నట్టుగా అందరికీ ప్రయోజనం కలిగిస్తారా? అని ఆరా తీయగా... టీడీపీ విశ్వసనీయ వర్గాల నుంచి షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. ప్రతి పథకానికి షరతులు వర్తిస్తాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఉదాహరణకు జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో రూ.15 వేలు అందిస్తోంది. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నా, ఒక విద్యార్థికి మాత్రమే ప్రయోజనం కలిగిస్తోంది.
ఇదే పథకాన్ని చంద్రబాబు కూడా అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఈ పథకం లబ్ధిదారుల విషయంలో... ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు పథకం వర్తించదని టీడీపీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే, తెల్ల రేషన్కార్డు కలిగిన వారికి మాత్రమే పథకం వర్తిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో చాలా పరిమితంగా మాత్రమే లబ్ధిదారులు మిగులుతారు. పథకాన్ని అమలు చేసినట్టు అవుతుందని చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు.
అలాగే ప్రతి పథకానికి ఏదో ఒక లింక్ పెడతారని తెలుస్తోంది. ఒక పథకం వర్తించే వారికి, మరొకటి ఇవ్వకూడదనేది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. రైతు భరోసా కింద రూ.20 వేలు ఇస్తామనడం పచ్చి అబద్ధమని తెలుస్తోంది. ప్రతి పట్టాదారు పాసు పుస్తకానికి రూ.20 వేలు ఇచ్చే అవకాశాలు లేవని సమాచారం. కేవలం ఇంటికొకరికి మాత్రమే రూ.20 వేలు ఇచ్చేలా షరతులు విధిస్తారని టీడీపీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మూడో వంతు రైతులకు మాత్రమే లబ్ధి కలుగుతుందని తెలుస్తోంది.
ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే... మేనిఫెస్టో అమలు, ప్రతి పథకానికి తప్పని సరిగా షరతులు వర్తిస్తాయని అంటున్నారు. షరతుల పేరుతో లబ్ధిదారుల్లో సగానికి సగం కోత విధిస్తారని టీడీపీ నేతలే చెబుతున్నారు. అందుకే మేనిఫెస్టోపై టీడీపీ, జనసేన పెద్దగా ప్రచారం కూడా చేసుకోవడం లేదు. ఎలాగోలా అధికారంలోకి వస్తే, మేనిఫెస్టో అమలు దేవుడికెరుక అనే భావనలో టీడీపీ, జనసేన నేతలు ఉన్నారని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు అంటే... మాట ఇస్తే, అసలు చేయరనేందుకు బ్రాండ్ అంబాసిడర్. అందుకే ఆయన ఇస్తున్న హామీలకు ఆదరణ లభించడం లేదని ప్రత్యర్థులు అంటున్నారు.