చంద్రబాబునాయుడు రాజగురువు పత్రికకు ప్రధాని మోదీ తీవ్ర నిరాశ మిగిల్చారు. పచ్చబ్యాచ్కు మోదీ వరుస షాక్లు ఇస్తున్నారని చెప్పొచ్చు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులతో మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజగురువు పత్రికకు సంబంధించి ఏపీ ఎడిటర్ ప్రత్యేకంగా సంభాషించారు. మోదీ ఇంటర్వ్యూ వివరాలను పేజీలకు పేజీలను ఆ పత్రిక ప్రచురించింది.
ఈ ఇంటర్వ్యూలో గమ్మత్తు ఏంటంటే... ఎల్లో మీడియా, టీడీపీ, జనసేన కోరుకున్న అంశాలకు చోటు లేకపోవడం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఏదో రకంగా బురద చల్లడమే ఎల్లో మీడియా ఎజెండాగా పెట్టుకుంది. వైసీపీకి వ్యతిరేకంగా దారిన పోయే వ్యక్తి మాట్లాడినా, తామే ఏదో ఒక హోదా తగిలించి ప్రచురించడాన్ని చూస్తున్నాం. అలాంటిది దేశ ప్రధాని, అది కూడా ఏపీలో కూటమి భాగస్వామి బీజేపీకి కర్త, కర్మ, క్రియ అయిన మోదీ ఇంటర్వ్యూలో ప్రధాన ప్రత్యర్థి, సీఎం జగన్పై మాట మాత్రమైనా ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సీఎం జగన్పై మోదీతో విమర్శలు చేయించే ప్రయత్నం రాజగురువు పత్రిక వైపు నుంచి జరిగి వుంటుందని, అయితే అలాంటి పప్పులుడకలేదనే చర్చకు తెరలేచింది. రాజగురువు పత్రిక ఏపీ ఎడిటర్ ఇంటర్వ్యూ చేస్తే, తెలంగాణ అంశాలను మోదీ మాట్లాడ్డం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. తెలంగాణ రాజకీయాల గురించి మోదీ మాట్లాడుతూ... తమ ప్రత్యర్థులైన బీఆర్ఎస్, కాంగ్రెస్లపై తీవ్ర ఆరోపణలు చేశారని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
కానీ ఏపీలో తమ ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఎందుకిలా జరిగింది? తాము కోరుకున్నట్టు వైసీపీ ప్రఃభుత్వంపై, అలాగే జగన్పై మోదీ నుంచి విమర్శలు రాకపోవడం వల్లే... ఆ అంశాలు ప్రచురించి ఉండకపోవచ్చనే చర్చకు తెరలేచింది. తెలంగాణ గురించే ప్రధానంగా ప్రశ్నలు, సమాధానాలు కనిపించాయి.
తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా కేంద్రం తమకేమీ ఇవ్వడం లేదని అక్కడి ప్రభుత్వాలు ఆరోపించడం వారి చేతగానితనానికి నిదర్శనంగా మోదీ ఘాటు విమర్శలు చేశారు. అలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్లకు తెలంగాణ ఏటీఎంగా మారిందని ప్రధాని ఆరోపణ చేశారు. కేసీఆర్ సర్కార్ను గద్దె దించడానికి పదేళ్లు పట్టిందని, కానీ కాంగ్రెస్ను దించడానికి అంత సమయం పట్టదని మోదీ సంచలన కామెంట్స్ చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తమదే అని ఏపీ ప్రజానీకానికి మోదీ హామీ ఇవ్వడం ఇంటర్వ్యూ విశేషంగా చెప్పుకోవచ్చు.
కానీ ఏపీ రాజకీయాలపై నామమాత్రంగా కూడా ప్రస్తావన లేకపోవడం ఒకింత షాకింగ్ కలిగిస్తోంది. తమ భాగస్వామ్య పక్షాల నాయకులు చంద్రబాబు, పవన్కల్యాణ్ గురించి సానుకూల కామెంట్స్ చేయించేందుకు రాజగురువు పత్రిక తప్పక ప్రయిత్నించి వుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ మోదీ దగ్గర వారి పప్పులుడకక పోవడం వల్లే...ఏపీకి సంబంధించి చప్పగా సాగిందని చెప్పొచ్చు. మోదీ ఇంటర్వ్యూ ద్వారా బాబు, పవన్లపై మోదీకి సదభిప్రాయం లేదని తేటతెల్లమైందనే చర్చకు తెరలేచింది.