ఈ ఒక్క విషయంలో బీజేపీని మెచ్చుకోవాలి. అమలుకు నోచుకోని హామీలిచ్చి, అందులో బీజేపీని భాగస్వామ్యం చేయాలనే బాబు ఎత్తుగడను బీజేపీ చిత్తు చేసింది. బాబు, పవన్కల్యాణ్ కలిసి ప్రజాగళం పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోతో తమకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పడం ద్వారా ...తస్మాత్ జాగ్రత్త అని ఏపీ ప్రజానీకాన్ని బీజేపీ పరోక్షంగా హెచ్చరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు, పవన్కల్యాణ్ కలిసి ప్రజలను వంచించేందుకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని బీజేపీ చెప్పకనే చెప్పింది.
తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు, టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై నిర్మొహమాటంగా మనసులో మాట బయట పెట్టారు. ఆ మేనిఫెస్టోకు తాము గ్యారంటీ ఇవ్వదని తేల్చి చెప్పారు. అసలు ఆ మేనిఫెస్టో అమలు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు జగన్ పథకాలు సాధ్యం కావని చెబుతూ, మరోవైపు అంతకంటే రెట్టింపుగా ఇస్తామనడం సరైందా? అని చంద్రబాబు, పవన్ను ఆయన నిలదీయడం చర్చనీయాంశమైంది.
రాజకీయ కారణాలతో పొత్తు పెట్టుకున్నప్పటికీ, వారి మేనిఫెస్టోకు ఎలా మద్దతు ఇస్తామని ఆయన ప్రశ్నించారు. తమకు క్రెడిబిలిటీ ఉందని, దాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేకే మేనిఫెస్టో విషయంలో దూరంగా ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదని, ఆయన ఏమైనా హామీలు ఇస్తారనే అర్థం ఆయన మాటల్లో ధ్వనించింది. అంతేకాదు, బాబు, పవన్ ప్రకటించిన మేనిఫెస్టో కాంగ్రెస్కు కాపీ అని ఆయన ఘాటు విమర్శలు చేశారు.
కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన పథకాలకే. ఏపీలో ఇంగ్లీష్లో ముద్దుగా సూపర్ సిక్స్ అని పేరు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు, పవన్కల్యాణ్ హామీలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పడం ద్వారా... వాళ్లిద్దరికి విశ్వసనీయత లేదని బీజేపీ స్పష్టమైన సంకేతాలు పంపింది. పొత్తులో ఉంటూ, తమ రాజకీయ పరపతి దెబ్బతీసేలా బీజేపీ వ్యవహరిస్తోందని చంద్రబాబు, పవన్కల్యాణ్ గుర్రుగా ఉన్నారు. ఎవరేమనుకున్నా బాబు మోసకారి అని చెప్పడం ద్వారా... తాము సేఫ్ సైడ్ వుండాలని బీజేపీ భావిస్తున్నట్టు అర్థమవుతోంది.